14 రోజుల తరవాతే సిలిండరు నమోదు…
వంట గ్యాస్ సిలిండర్లకు అనూహ్యంగా డిమాండు పెరగటంతో గ్యాస్ కంపెనీలు ఆంక్షలు విధించాయి. బుక్ చేసిన సిలిండరు డెలివరీ అయిన 14 రోజుల తరవాత మాత్రమే మరో దానిని బుక్ చేసుకునేలా గ్యాస్ కంపెనీలు నిర్ణయించాయి. భారత్, హెచ్పీ గ్యాస్ కంపెనీలు శుక్రవారం నుంచి ఈ నిబంధనను అమలు చేయగా..
ఇండేన్ కంపెనీ శనివారం నుంచి అమలు చేయనున్నట్లు సమాచారం. ఇప్పటి వరకు సిలిండరు వచ్చిన 24 గంటల తరవాత మరొకటి నమోదు చేసుకోవచ్చు. కరోనా వైరస్ తీవ్రత నేపథ్యంలో ప్రభుత్వం లాక్డౌన్ ప్రకటించటంతో ప్రజలు ముందు జాగ్రత్తగా సిలిండర్లు బుక్ చేస్తున్నారు.
ఉజ్వల పథకం కింద వంట గ్యాస్ కనెక్షన్ పొందిన వారికి మూడు బండలను ఉచితంగా అందజేస్తామని కేంద్రం ప్రకటించటంతో వారు కూడా సిలిండర్లు తీసుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ నేపథ్యంలో అనూహ్యంగా డిమాండ్ పెరిగింది. తెలంగాణలో సాధారణ రోజుల్లో సగటున రెండు లక్షల సిలిండర్లు నమోదవుతుంటాయి. ప్రస్తుతం రోజుకు మూడు లక్షల నుంచి మూడున్నర లక్షల వరకు బుకింగ్స్ వస్తుండటంతో.. 14 రోజుల నిబంధనను అమలులోకి తీసుకొచ్చారు.
Post a Comment